Mar 30, 2012

ఎమ్మెల్యేలకూ నో వర్క్-నో పే! జనచైతన్యవేదిక డిమాండ్

 శాసనసభ సమావేశాలు వృథాప్రయాసగా మారాయని జనచైతన్య వేదిక అభిప్రాయపడింది. బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు ఏ మాత్రం ప్రజోపయోగం కాదని, చట్టసభలను రచ్చసభలుగా మార్చవద్దని వేదిక నేతలు వ్యాఖ్యానించారు. సభ జరగని రోజుల్లో ఎమ్మెల్యేలకు వేతనం ఇవ్వకుండా నోవర్క్ - నోపే విధానాన్ని వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల తీరుతెన్నులపై వేదిక ప్రతినిధులు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సీనియర్ రాజకీయ నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు, శాసనసభ మాజీ కార్యదర్శి సదాశివరెడ్డి, ప్రజ్ఞాభారతి అధ్యక్షుడు డాక్టర్ త్రిపురనేని హనుమాన్‌చౌదరి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి, ప్రముఖ కవి ఉండేల మాలకొండారెడ్డి తదితరులు మాట్లాడారు. బీఏసీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలుకాకపోవడమే సభ సజావుగా జరగకపోవడానికి కారణమన్నారు. వాయిదా తీర్మానాలను సభ్యులు ప్రవేశపెట్టడం, వాటిని స్పీకర్ తిరస్కరించడం, అనంతరం సభ్యుల ఆందోళనతో ప్రశ్నోత్తరాలు వాయిదా పడడం రివాజుగా మారిందన్నారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు సభ జరగకుండా ఉండేందుకు ఎన్ని చర్యలు చేపట్టాలో అన్ని చర్యలూ తీసుకున్నారని ఆరోపించారు. అవినీతి, రైతాంగ సమస్యలు, విద్యుత్, తాగునీటి సమస్యలు, తెలంగాణ లాంటి సమస్యలను చర్చించలేకపోవడం దురదృష్టకరమన్నారు. అన్ని పార్టీలూ శాసనసభ గౌరవాన్ని, సాంప్రదాయాలను కాపాడేలా కృషిచేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment