(ఆంధ్రజ్యోతి వార్త)
సర్కారీ పెద్దలకు సలామ్ కొట్టే ఓ ఐఏఎస్... ఆ ఐఏఎస్కు గులామ్లుగా ముగ్గురు ఆర్డీవోలు! ఇదో ముఠా! వీరి దెబ్బకు హైదరాబాద్ ఠా! ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన ఆ అధికారే భక్షకుడిగా మారాడు. వందల కోట్ల విలువైన స్థలాలకు రెక్కలు తొడిగాడు. 'మ్యుటేషన్ చక్రవర్తి'గా అవతరించి ప్రభుత్వ భూములను పరాధీనం చేశాడు. ఆ అధికారి పేరు... నవీన్ మిట్టల్. వైఎస్ హయాంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా చక్రం తిప్పారు. ఇప్పుడు... జీహెచ్ఎంసీ ప్రత్యేక కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. మిట్టల్ హయాంలో జరిగిన భూపాపాలను ఇప్పుడు తవ్వితీస్తున్నారు. 2008 - 2010 మధ్య కాలంలో రూ.2,030 కోట్ల విలువైన భూమిని పందేరం చేసినట్లు తేల్చారు. ఈ మ్యుటేషన్లన్నింటిపై పునఃసమీక్షకు రంగం సిద్ధమవుతోంది. దర్గా భూమిని దర్జాగా ప్రైవేటుకు కట్టబెట్టిన వైనంపై 'ఆంధ్రజ్యోతి' ఇటీవల ప్రచురించిన కథనంతో మొత్తం డొంక కదిలించాలని రెవెన్యూ యంత్రాంగం నిర్ణయించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 29 : 'ఆంధ్రజ్యోతి' తీగలాగింది. భూ అక్రమాల డొంక కదులుతోంది. పందేరాల జాతరలో జరిగిన అవకతవకల అంతు తేల్చే దిశగా అడుగు పడుతోంది. రాజధానిలో ఖరీదైన ప్రభుత్వ భూములను బడాబాబులు, సంపన్న వర్గాలు, నేతలకు అడ్డదిడ్డంగా కట్టబెట్టిన వైనం అధికారికంగా బయటపడుతోంది. రెండేళ్లలోనే 2030 కోట్ల విలువైన భూములు పరాధీనమైనట్లు లెక్కతేలింది. ప్రభుత్వ భూములను కాపాడటంలో నాటి కలెక్టర్ నవీన్ మిట్టల్, ముగ్గురు ఆర్డీవోలు విఫలమైనట్లు స్పష్టమైంది. హైదరాబాద్ జిల్లా యంత్రాంగం భూముల అక్రమ మ్యుటేషన్లపై మండలం వారీగా ఈ లెక్కలు తీసింది. దీనిపై సమగ్రనివేదిక సిద్ధం చేసింది.
అక్రమ మ్యుటేషన్లపై సమీక్షకు అనుమతించాలని కోరుతూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)కు నివేదిక సమర్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలను 'ఆన్లైన్' సేకరించగలిగింది. 'ఆంధ్రజ్యోతి' గతంలో బయటపెట్టిన అనేక అంశాలు ఈ నివేదికలో ఉన్నాయి. దీంతో ఆ కథనాలన్నీ అక్షరసత్యాలని రుజువవుతోంది. అంతేకాదు... మ్యుటేషన్ల పునఃసమీక్షకు కూడా 'ఆంధ్రజ్యోతి' ప్రచురించిన కథనమే మూలకారణం కావడం విశేషం. దర్గాషా ఖామో ష్కు చెందిన వక్ఫ్భూమిని... దర్గా ముతవలీకే మ్యుటేషన్ చేసిన సంగతిని ఈనెల 21న 'ఆంధ్రజ్యోతి' బయటపెట్టింది.
ఈనేపథ్యంలో... 'ఇలా ఇంకెన్ని జరిగాయో! ఆ లెక్క తీయాల్సిందే!' అని రెవెన్యూ శాఖలో నీతి, నిజాయితీ కలిగిన ఉన్నతస్థాయి అధికారులు భావించారు. 2008 నుంచి 2010 వరకు హైదరాబాద్ జిల్లా పరిధిలో జరిగిన మ్యుటేషన్లపై నివేదిక తయారుచేయాలని ఆదేశించారు. దీనిపై హైదరాబాద్ జేసీ రంగంలోకి దిగారు. తహసిల్దార్లతో అత్యవసర భేటీ ఏర్పాటుచేసి... మ్యుటేషన్ల లోగుట్టు విప్పాలని, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైన వివరాలపై నివేదిక సిద్ధం చేయాలని చెప్పారు. అధికారులు వారం పాటు శ్రమించి నివేదిక ఇచ్చారు. 2030కోట్ల ప్రభుత్వభూమి పెద్దలపాలైందని తేల్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నివేదికలో ముఖ్యాంశాలివి..
మల్పానీకి 432కోట్ల మేలు...
అది తిరుమలగిరి మండలం తోకట్ట గ్రామం. అక్కడ 18ఎకరాల భూమి ఉంది. ఇది సాలార్జంగ్ ఎస్టేట్లో భాగమని (గైరాన్ సర్కారీ, అబాదీ) చెబుతున్నారు. తోకట్ట, హస్మత్పేట్ గ్రామాల్లో ఉన్న ఈ భూమిపై సరిహద్దు వివాదం ఉండేది. రెవెన్యూ అధికారులు సమగ్ర సర్వే జరిపి హద్దులు నిర్ణయించాల్సి ఉంది. కానీ.. అత్యంత చిత్రంగా ఈ భూమిని మల్పానీ అనే వ్యక్తికి అప్పగించారు. దీని విలువ రూ.432 కోట్లు అని అధికారులు లెక్క తేల్చారు.
పద్మాలయకు 456 కోట్ల వరం
రాజధానిలో సినీ పరిశ్రమ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నామమాత్రపు ధరకు షేక్పేట్ గ్రామంలో పద్మాలయ స్టూడియోస్కు 9.20 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా అందులో కొంత భూమిని జీ-టెలీఫిల్మ్స్కు విక్రయించింది. ఆ భూమి విలువ రూ. 456 కోట్లు.
దర్గాకు 222 కోట్ల భూమిపై...
నాంపల్లిలో 37వేల చదరపు మీటర్ల భూమిపై వివాదం నెలకొంది. ఇది వక్ఫ్భూమి అని దర్గాషా ఖామోష్ వాదన. కాదు అది ప్రభుత్వ భూమి అని, శ్మశాన వాటికకోసం కేటాయించిందని హైదరాబాద్ జిల్లా యంత్రాంగం చెబుతోంది. ఈ భూమిలో కొంత మాత్రమే దర్గాదని, మిగిలినది వక్ఫ్ భూమి కాదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే.. వక్ఫ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశం ఆధారంగా మొత్తం భూమిపై దర్గాకు హక్కులు కల్పిస్తూ నవీన్ మిట్టల్ 2008లో మ్యుటేషన్ చేశారు. ఇలా చేసే అధికారం కలెక్టర్కు లేదు. ఈ భూమి విలువ 222 కోట్ల రూపాయలని అధికారులు ఇప్పుడు తేల్చారు. ఈ ఉత్తర్వులను పునఃసమీక్షించాలని కోరుతూ ప్రస్తుత కలెక్టర్ గత నెల 31న సీసీఎల్ఏకు లేఖ (బి2/9166/2011) రాశారు.
ఇలా ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా దర్గాకు కేటాయించిన నవీన్ మిట్టల్ హయాంలోనే... అదే దర్గాకు చెందిన 9 ఎకరాలా 27 గుంటల భూమిని దర్గా ముతవల్లీకి సొంతం చేశారు. 2008 మార్చి ఒకటో తేదీన దీనిపై ఆర్డీవో ముంతఖాబ్( ఆదేశం) జారీ చేశారు. ఇది తప్పని ప్రస్తుత కలెక్టర్ తేల్చారు. ఈ భూమి విలువ 228 కోట్ల రూపాయలు ఉంటుందని ఇప్పుడు అంచనా వేశారు. ఈ మ్యుటేషన్ను పునఃసమీక్షించాలని కలెక్టర్ గత నెల 16న సీసీఎల్ఏకు లేఖ రాశారు. ఈ విషయాలన్నింటినీ ఇటీవలే 'ఆంధ్రజ్యోతి' బయటపెట్టింది.
96 కోట్ల అసైన్డ్ భూమి పరాధీనం...
షేక్పేటలో 7792 చదరపు మీటర్ల అసైన్మెంట్ భూమి పరులపాలైంది. దీని విలువ ఇప్పుడు 96 కోట్ల రూపాయలు. సర్వే జరిగిన సమయంలో భూమి పొందిన వ్యక్తి (అసైనీ) పొజిషన్లో లేరు. అతనికి బదులు పొజిషన్లో ఉన్న మరో వ్యక్తిని కబ్జాదారుగా ప్రకటించారు. అయితే... అనుమానిత గిఫ్ట్ డాక్యుమెంట్లతో మూడో పార్టీ వచ్చి ఆ భూమి తనదే అని పేర్కొంది. దీనిని వారికే మ్యుటేషన్ చేశారు. ప్రభుత్వం ఈ ఉత్తర్వును నిలిపివేసింది.
* కందికల్లో 8ఎకరాల భూమిపై 2010 ఏప్రిల్లో కలెక్టర్ మ్యుటేషన్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ వివాదం ప్రస్తుతం సీసీఎల్ఏలో కమిషనర్ అప్పీల్స్ ముందు ఉంది. ఈ భూమి విలువ 192 కోట్ల రూపాయలు.
* ఆసిఫ్నగర్లో 20వేల చదరపు మీటర్ల జి. టెంపుల్ భూమి విలువ రూ.100 కోట్లు. ఇనాం రద్దుచట్టంతో ఈ భూమి ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది. దీనిని ప్రైవేటు వ్యక్తులకు మ్యుటేషన్ చేశారు.
* షేక్పేట గ్రామంలో 13 కోట్ల విలువైన 1306 చదరపు మీటర్ల భూమిని 2008లో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు.
* ముషీరాబాద్లో 9 కోట్ల విలువైన భూమి మ్యుటేషన్కు అనుమతించారు. ఆర్డీవో తిరస్కరించినా కలెక్టర్ కరుణించారు.
* షేక్పేటలో 1378 చదరపు మీటర్ల సర్కారీ పోరంబోకు భూమిని 2009లో ప్రైవేటు వ్యక్తులకు మ్యుటేషన్ చేశారు.
పునఃసమీక్షకు అనుమతిస్తారా?
అధికారులు కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇన్ని భూ బాగోతాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం పూర్తిస్థాయి పరిశీలనకు అనుమతిస్తే మరెన్నో వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. ఇప్పుడు... ఈ అక్రమ మ్యుటేషన్లపై పునఃసమీక్షకు సర్కారు అనుమతిస్తుందా? అనేది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అప్పట్లో జరిగిన భూ దందాలో బడా అధికారులతోపాటు నాటి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించిన ఓ నేత, మాజీ మంత్రి హస్తం కూడా ఉంది.
అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి, కొందరిని భయభ్రాంతులకు గురిచేసి మరీ మ్యుటేషన్లు చేయించుకున్నారు. ఇది ఓరకంగా బహిరంగ రహస్యం. ఇప్పుడు సంతకాలు చేసిన అధికారులు మాత్రం దొరికిపోయారు. తెర వెనుక నుంచి ఆదేశాలు జారీ చేసిన పెద్దలు కోట్లు మూటగట్టుకుని, తెరవెనుకే ఉండిపోయారు. పొలిటికల్ పెద్దలను బయటపడేసేందుకు సర్కారు సరేనంటుందా? పునఃసమీక్షకు అనుమతిస్తుందా? వేచి చూడాల్సిందే!
No comments:
Post a Comment